ఫైనల్‌ నవీ ముంబైలో

బాలికల అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్నది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌  షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు విడుదల చేశారు. మొత్తం ఐదు నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, గువాహటి, కోల్‌కతాలో లీగ్‌ మ్యాచ్‌లు.. నవీ ముంబైలో ఫైనల్‌ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ‘భారత్‌లో మరో ప్రతిష్ఠాత్మక టోర్నీ జరుగనుంది. మన అమ్మాయిలు తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ఆడుతున్నారు. 


 


ఇది దేశానికి గర్వకారణం. మనమంతా కలిసి టోర్నీని విజయవంతం చేద్దాం’ అని రిజిజు పిలుపునిచ్చారు. ‘కలల్ని కొల్లగొట్టండి’ (కిక్‌ ఆఫ్‌ ద డ్రీమ్‌) అనే నినాదంతో నిర్వహించనున్న ఈ టోర్నీ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశామని ఆయన అన్నారు. ఈ టోర్నీ నవంబర్‌ 2న ప్రారంభమై.. 21న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.